TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాయలసీమ ద్రోహి ముమ్మాటికి జగనే.. మంత్రి మండిపల్లి

Published on: Tue Mar 3, 2026 9:51AM

రాయలసీమ ద్రోహి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే రాయలసీమ హక్కుల పేరుతో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాజకీయ డ్రామాకు తెరలేపిందని ఆయనో ప్రకటనలో దుయ్యబట్టారు.  జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎన్నడూ రాయలసీమను పట్టించుకోలేదనీ, ఇప్పుడు సీమ హక్కుల పేర సభలు నిర్వహించడం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన పేర్కొన్నారు.

 జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి,  రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు. డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసి రైతులకు నష్టం కలిగించారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టి ప్రజలను తప్పుదారి పట్టించారని తెలిపారు.  2020 అక్టోబర్ 29న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులు నిలిపివేయాలని ఆదేశించిందని, అలాగే క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అనుమతులు లేకుండా పనులు చేయొద్దని స్పష్టం చేశాయని పేర్కొన్నారు.

2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో  కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించి, శ్రీశైలంలో నీటిని ఆదా చేసి రాయలసీమకు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.రాయలసీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు దృఢ సంకల్పం స్పష్టమన్న ఆయన హంద్రీనీవా  ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా చర్యలు వేగవంతం చేశామని తెలిపారు