దేశం కార్యకర్తలను నిరుత్సాహపరుస్తున్న దీపక్ రెడ్డి
Published on: Sat May 5, 2012 12:31PM
అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న దీపక్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నారు. మాజీమంత్రి జెసి దివాకర్ రెడ్డికి బంధువైన దీపక్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఇలా డబ్బున్న వ్యక్తికీ టిక్కెట్టు ఇవ్వడం వల్ల అతను ఎన్నికల్లో డబ్బు మంచినీళ్ళలా ఖర్చుపెడతాడని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశించారు. అయితే దీపక్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ఖర్చు విషయంలో చాలా పొదుపు పాటిస్తుండటమే కాక చాలా నిఖచ్చిగా ఉండటం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రచారానికి వెళ్ళే పదిమంది కార్యకర్తలకు ఒక వాహనం, రెండు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. ఈ డబ్బు తమ భోజనం ఖర్చులకు కూడా చాలటం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఉప ఎన్నికల్లో కార్యకర్తలకు, నాయకులకు డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని పత్రికలకు కూడా ప్రకటనలు ఇవ్వనని దీపక్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. దీంతో నాయకులతో పాటు విలేఖరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీపక్ రెడ్డి వ్యవహారశైలిపై కొందరు నాయకులు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదులు పంపుతున్నారు.


