అసాధారణ వ్యక్తి రతన్ టాటా.. ప్రధాని మోడీ
Published on: Thu Oct 10, 2024 10:25AM

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, దయార్ధహృదయుడు, అసాధారణమైన వ్యక్తి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వాన్ని అందింరని ప్రస్తుతించారు. ఆయన వినయం, దయ, సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధత గలిగిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు అలాగే తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ రతన్ టాటాను కలిసిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తీరని లోటని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
నిజమైన మానవతావాది.. చంద్రబాబు
రతన్ టాటా నిజమైన మానవతావాది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన తన దార్శనికత, చిత్తశుద్ధితో ప్రపంచంపై తనదైన ముద్ర వేశారన్నారు. రతన్ టాటా మరణంతో మనం కేవలం ఒక వ్యాపార టైకూన్నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. పరిశ్రమ, దాతృత్వం విషయంలో నే కాకుండా దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సహకారాన్ని ఎన్నదగినదని చంద్రబాబు పేర్కొన్నారు.
దూరదృష్టి గలిగిన నేత.. రేవంత్ రెడ్డి
"రతన్ టాటా మృతితో భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది అని తన సంతాప సందేశంలో పేర్కొన్న రేవంత్ రెడ్డి టాటా జీవితం వినయం, విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం. ఆయన అసాధారణ నాయకత్వంలో టాటా బ్రాండ్ అసమానమైన ఎత్తులకు ఎదిగిందన్నారు.
నమ్మలేకపోతున్నా.. ఆనంద్ మహీంద్రా
రతన్ టాటా మరణించారని నమ్మలేకపోతున్నానని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో ఉండడం వెనుక ఆయన కృషి మార్గదర్శకత్వం ఉన్నాయని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన నిష్క్రమణ తర్వాత, మనం చేయగలిగేదల్లా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమేనని ట్వీట్ చేశారు.


