TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షాబాద్ లో ఆరుగురి హత్య.!

Published on: Sat Jul 11, 2026 10:04AM

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం(జులై 11)  తెల్లవారుజామున జరిగిన హత్యలు కలకలం సృష్టించాయి. గతంలో తనపై పోక్సో కేసు పెట్టారనే  కక్షతో  ఒక వ్యక్తి, ఏకంగా ఆరుగురిని హత్య చేశాడు. ఈ దారుణ నరమేధంలో నిందితుడు కేవలం ఫిర్యాదుదారులనే కాకుండా, తన స్వంత భార్యను,  పిల్లలను కూడా వదలకుండా ప్రాణాలు తీయడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులను కూడా నిందితుడు దారుణంగా హత్య చేశాడు.  

వివరాలిలా ఉన్నాయి.  దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ (  గతంలో ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత బాలిక,  ఆమె తల్లి కలిసి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన షాబాద్ పోలీసులు రాజ్‌కుమార్‌పై పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న నిందితుడు ఇటీవలే  బెయిల్‌పై బయటకు  వచ్చాడు. అయితే తనను జైలుకు పంపారనే కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ శనివారం (జులై 11)  తెల్లవారుజామున  బాధితుల ఇంటిపై దాడికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న బాధితులకు తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా విచక్షణారహితంగా నరికి చంపాడు. ఈ దాడిలో గతంలో నిందితుడిపై ఫిర్యాదు చేసిన బాధిత బాలిక, ఆమె తల్లి,  ఆ బాలిక నానమ్మ ఘటనా స్థలంలోనే మరణించారు. ఆ తరువాత  రాజ్‌కుమార్.. తన  భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకును కూడా హత్య చేశాడు. ఈ ఆరు హత్యలూ చేసిన తరువాత రాజ్ కుమార్..  తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చేసిన దారుణాన్ని వివరించాడు. కొడుకు నోట ఆరుగురి ఊచకోత ఉదంతాన్ని విన్న తల్లిదండ్రులు వెంటనే   పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు లు నిందితుడు రాజ్‌కుమార్‌ను   అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.