ఓ వైపు దాడులు.. మరోవైపు అంకుల్ బాగున్నారా?
posted on Apr 12, 2019 2:45PM
నిన్న ఏపీలో ఎన్నికల సందర్భంగా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చాలా ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని భయానక వాతావరణాన్ని సృష్టించారు. అయితే ఏపీలో ఒకవైపు ఇరు పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరుగుతుండగా.. మరోవైపు ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్, ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు, వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంలు ఒకేసారి వచ్చారు. వారితో పాటు రెండు పార్టీల కార్యకర్తలూ అక్కడకు చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వెడేక్కింది. ఇంతలో రామ్మోహన్నాయుడు.. సీతారాంను చూసి అంకుల్ బాగున్నారా అని చిరునవ్వుతో పలకరించారు. దీంతో ఆయన కూడా రామ్ బాగున్నావా అని భుజం తట్టడంతో రాజకీయ వేడి చల్లబడింది.