TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘గోవిందుడు...’ మీద రూమర్లన్నీ అబద్ధాలే!

Published on: Sun Jun 15, 2014 3:30PM

 

రామ్‌చరణ్, కాజల్ జంటగా, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విషయంలో బోలెడన్ని పుకార్లు వచ్చాయి. ఈ సినిమా కథ నచ్చలేదని రామ్‌చరణ్ సినిమా ఆపేశాడని, ఆ తర్వాత ఈ సినిమా కథ మార్చారని, మెగా ఫ్యామిలీ ఇంటర్‌ఫియరెన్స్ వల్ల కృష్ణవంశీ ఇబ్బంది పడుతున్నాడని పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లన్నీ పచ్చి అబద్ధాలని నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. రామ్ చరణ్‌కి జ్వరం రావడం, ఈ సినిమాలో ప్రధాన పాత్రని ధరిస్తున్న తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని మార్చడం కారణంగా సినిమా షూటింగ్ ఆగింది తప్పితే మరో కారణమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘గతంలో మా సంస్థ ‘గబ్బర్‌సింగ్’ సినిమా తీస్తున్నప్పుడు ఇలాగే రూమర్లు వ్యాపించాయి. ఆ రూమర్లని అబద్ధాలు చేస్తూ మేము ఘన విజయం సాధించాం. అదే ‘గోవిందుడు అందరివాడేలో’ విషయలో కూడా రిపీట్ అవుతుంది. మొదట మా సినిమాలో ప్రధాన పాత్ర కోసం తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే... ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే... ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. ఈ చిన్న చిన్న అవాంతరాల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగింది. అంతేతప్ప ఈ సినిమాని ఆపేయమని చిరంజీవి గారు అన్నారని వచ్చిన వార్తలు రూమర్స్. అసలు చిరంజీవి గారు ఇంతవరకు ఈ సినిమా రషెస్ కూడా చూడలేదు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామానాయుడు సినీ విలేజ్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఇంటి సెట్‌లో జరుగుతోంది.