TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జమ్మల‘మడుగు’లో రెండు పెద్ద చేపల జగడం!

Published on: Mon Jul 3, 2017 4:56PM

 

కాకి తన స్వంత గూడు కట్టుకోదట! కోకిల ఏర్పాటు చేసిన దాంట్లోనే తన పిల్లల్ని కూడా వుంచేస్తుందట. తీరా కాకి పిల్లలు రెక్కలు రాగానే గూట్లోంచి తుర్రుమంటాయట! ఇదంతా నిజమో కాదోగాని… ప్రస్తుతం మన రాజకీయాలు చూస్తోంటే పక్కా నిజమనిపిస్తోంది! ఏ నియోజకవర్గంలో చూసినా ఒక నేత పుట్టలో మరో నేత వచ్చి వేలు పెడతాడు. వలస మంత్రం పటిస్తూ తాను గెలిచిన పార్టీ వదిలేసి అధికార పార్టీలోకి జంప్ అవుతాడు. ఇక ఆ తరువాత అంత కాలం పార్టీని నమ్ముకుని వున్న నాయకుడికి, కార్యకర్తలకి చుక్కలు చూపిస్తాడు. ఇదీ వ్యవహారం…

 

దేశంలో ఎక్కడ చూసినా జంప్ జిలానీలు ఎక్కువైపోయారు. ఇందుకు ఆంధ్ర రాష్ట్రం కూడా మినహాయింపు కాదు! అయితే, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు… పాలన మీద దృష్టి పెట్టలేకుండా ఈ జంప్ జిలానీల రగడ ఎక్కువపోతోంది. అంతలా ఏదో ఒక నియోజకవర్గం రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఉప ఎన్నికల కోలాహలంతో వున్న నంద్యాల మొన్నటి వరకూ భూమా, శిల్పా వర్గాల నడుమ భీభత్సమైన వార్ తో వార్తల్లోకి ఎక్కింది. అక్కడ అన్ని సమస్యలకి మూలం వైసీపీ నుంచి జరిగిన వలసలే అని అందరికీ తెలిసింది!

 

కడప జిల్లా టీడీపీలో కూడా చంద్రబాబుకు హెడేక్ తెచ్చే కలకలం ఒకటి చాలా రోజులుగా రేగుతోంది. ఎట్టకేలకు ఇప్పుడు అది ముఖ్యమంత్రి సమక్షంలోకి చేరింది. ఇంతకాలం జమ్మలమడుగు కాన్ స్టిట్యుయెన్సీకే పరిమితమైన రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి గొడవ ఇప్పుడు చంద్రబాబు కోర్ట్ లోకి వచ్చింది. ఎప్పట్నుంచో టీడీపీలో వుంటోన్న రామసుబ్బారెడ్డి సీఎం కలిసి ఆదినారాయణ రెడ్డి, ఆయన వర్గం గురించి కంప్లైంట్ల వర్షం కురిపించారట! చాలా చోట్ల వలస నేతలు వస్తే ఏమవుతుందో ఇక్కడా అదే అవుతోంది. వైసీపీ నుంచి ఆదివారాయణ రెడ్డి రావటంతో అప్పటికే టీడీపీలో వున్న రామ సుబ్బారెడ్డి, అతడి వర్గం ఇబ్బందిగా ఫీలవుతున్నారు. రకరకాల అభివృద్ధి పనుల్లో కూడా ప్రాధాన్యత ఆదినారాయణ రెడ్డి మనుషులకే దక్కుతోందట. దీంతో టీడీపీ కండువా భుజం మీద నుంచి తీయని ఎందరో సిన్సియర్ కార్యకర్తలు మెల్లమెల్లగా నిరాశకి, ఆగ్రహానికి గురవుతున్నారట!

 

మహానాడుకి కూడా రాకుండా నిరసన తెలిపిన రామసుబ్బారెడ్డి ఇప్పుడు చంద్రబాబుకి కంప్లైంట్ చేసేదాకా వెళ్లారు. ముందు ముందు ఈ జమ్మలమడుగు సంక్షోభం ఎటు దారితీస్తుందో మరి! కాకపోతే, నాయకులు, క్యాడర్ల మధ్య పోరు మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తే ఆది ఇబ్బందికరమైన స్థితే! ఎందుకంటే, కడప జిల్లా జగన్ కంచుకోట. అక్కడ ప్రతీ ఓటు టీడీపీకి ఎంతో అమూల్యం మరి…