TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Published on: Thu Apr 2, 2026 4:01PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో నెలకొన్న సుదీర్ఘ అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్  ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ రూపొందించిన  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 కు  రాజ్యసభ గురువారం (ఏప్రిల్ 2) ఏకగ్రీవ  ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఈ బిల్లు బుధవారం (ఏప్రిల్1) ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభ కూడా ఈ బిల్లకు పచ్చజెండా ఊపడంతో  అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించినట్లయింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు.  బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది. 

రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభ్యులు హర్షధ్వానాలు చేశారు. జై అమరావతి , జై ఆంధ్రప్రదేశ్  నినాదాలతో సభ మార్మోగింది. ఏపీ ప్రజలకు అద్భుతమైన నూతన రాజధాని నిర్మించుకునే అవకాశం లభించిందని సభాపతి అభినందనలు తెలిపారు.  

ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. గడిచిన కొన్నేళ్లుగా రాజధాని విషయంలో సందిగ్ధంలో ఉన్న రైతులకు, ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చినట్లయింది. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడుతుందని రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.