2021లో మిరాకిల్ ఖాయమన్న రజనీ... పిల్లీ ఎలుకంటూ అన్నాడీఎంకే సెటైర్లు

తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ ప్రజల కోసం అవసరమైతే కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని అన్నారు. తమిళ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారన్న రజనీ.... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు రావడం ఖాయమన్నారు. ఇక, అవసరమైతే కమల్ తో పనిచేస్తానన్న రజనీ... మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తుపై హింట్ ఇచ్చారు. అయితే, ఒకవైపు కమల్... మరోవైపు రజనీ చేస్తున్న వరుస ప్రకటనలతో తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి.

రజనీ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సెటైర్లు వేస్తోంది. కమల్, రజనీ కలిస్తే ఎలుకా పిల్లిలా ఉంటుందంటూ జోకులు పేల్చుతున్నారు. అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు పెద్ద అద్భుతం చేయబోతున్నారన్న రజనీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనీస్వామి వెరైటీగా స్పందించారు. అవును 2021లో తమిళ ప్రజలు నిజంగానే అద్భుతం చేయబోతున్నారు... మళ్లీ అన్నాడీఎంకేను అధికారంలోకి తేబోతున్నారు... ఇది అర్ధమయ్యే రజనీ అలా చెప్పారంటూ సెటైర్లు వేశారు.