TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పిడుగుపాటు హెచ్చరిక

Published on: Tue Jun 2, 2026 11:02AM

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.  ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో మంగళవారం (జూన్ 2)  పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. 

ఏపీలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో  ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందనీ, ఇక  సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అలాగే తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని పేర్కొన్న వాతావరణ శాఖ పిడుగు పాటుకు అవకాశం ఉన్నందున ప్రజలు   సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని   పొరపాటున కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇనుప హోర్డింగ్స్ కింద నిలబడకూడదని అధికారులు సూచించారు.