TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాగ్ధాటి పెంచుకో రాహుల్!

Published on: Sat Dec 26, 2015 1:11PM



మొన్నటి సాధారణ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యాన్ని పార్టీలో ఎవరూ చేయలేకపోయేవారు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ హయాం నుంచి చక్రం తిప్పినవాళ్ళు కూడా ఏ విషయంలోనూ కిక్కురుమనేవాళ్ళు కాదు. సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. రాజకీయంగా అపరిపక్వంగా వున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారేమోనన్న భయంతోనే జనం కాంగ్రెస్ పార్టీని ఓడించారన్న అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపించాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడినప్పటి నుంచి సోనియా, రాహుల్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో గళాలు వినిపించడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ కూడా తన వ్యతిరేక గళం వినిపించారు.

రాహుల్ గాంధీ భవిష్యత్తులో పార్లమెంటులో ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం వుందని పృథ్విరాజ్ చౌహాన్ చెప్పారు. ఎక్కువసేపు మాట్లాడ్డమే కాదు... ఎక్కువ విషయాలను కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ ఏ అంశం మీదైనా ఒకటి, రెండు వ్యాఖ్యలు చేసి ఊరుకుంటున్నారని, అది సరైన పద్ధతి కాదని పృథ్విరాజ్ చౌహాన్ చెప్పారు. మాట్లాడే విషయంలో మాత్రమే కాదు.. బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా రాహుల్ గాంధీ తనను తాను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం వుందని సలహా ఇచ్చారు. రాహుల్‌కి ఇప్పుడున్న బాడీ లాంగ్వేజ్ జనాన్ని ఆకట్టుకునేలా లేదని కూడా పృథ్విరాజ్ చౌహాన్ చెప్పారు. మరి ఈ సలహాలను తల్లీకొడుకులు ఎలా తీసుకుంటారో చూడాలి.