TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమిత్ షాకు కంగ్రాట్స్ చెప్పిన రాహుల్

Published on: Sat Jun 23, 2018 10:26AM

 

నోట్లరద్దు.. ఈ పదం వింటే ఇప్పటికీ చాలామందిలో వణుకు పుడుతుందేమో.. 2016 నవంబర్ 8 న ఐదొందలు,  వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. పాత నోట్లను మార్చుకోటానికి 50 రోజులు సమయం ఇచ్చింది.. ప్రజలు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లకు క్యూ కట్టారు.. జిల్లా సహకార బ్యాంకుల్లో మాత్రం నోట్లు మార్చుకోడానికి ఐదు రోజులే సమయం ఇచ్చారు.. ఈ నోట్లరద్దు వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు అంటే, బ్లాక్ మనీ కంట్రోల్ అవుతుంది సామాన్యులకు మంచి జరుగుతుందని ప్రభుత్వం సమర్ధించుకుంది.. తీరా చుస్తే 99 శాతం రద్దైన నోట్లు బ్యాంకులకు చేరాయి.. దీంతో నోట్లరద్దు విఫలం అయిందంటూ విపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు చేయటం.. ప్రభుత్వం సమర్ధించుకోవడం ఇలా రోజులు గడిచిపోయాయి.. ప్రజలు కూడా ఇక నోట్ల రద్దు ముగిసిన అంశం అనుకున్నారు.. కానీ నోట్లరద్దు మళ్ళీ తెరమీదకి వచ్చింది.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో ఎక్కువ నోట్లు జమ అయినట్టు తెలుస్తుంది.. అంతేకాదు అహ్మదాబాద్ సహకార బ్యాంకులో కేవలం ఐదు రోజుల్లో 750 కోట్ల రద్దైన నోట్లు జమ అయ్యి టాప్ ప్లేస్ లో ఉంది.. ఇంకో కొసమెరుపు ఏంటంటే ఈ బ్యాంకుకి అమిత్ షా డైరెక్టర్.. ఇంకేముంది విపక్షాలు మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు మొదలు పెట్టాయి.. ఇదే విషయంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. కేవలం ఐదు రోజుల్లోనే 750 కోట్ల రద్దైన నోట్లను మార్చి ఫస్ట్ ప్రైజ్ సాధించిన అహ్మదాబాద్ సహకార బ్యాంకు డైరెక్టర్ అమిత్ షా గారికి కంగ్రాట్స్ అంటూ రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.. అంతేకాదు నోట్లరద్దు వల్ల దేశమంతా ఇబ్బంది పడితే, అమిత్ షా మాత్రం లాభపడ్డారు అని రాహుల్ పేర్కొన్నారు.