ఎన్టీఆర్ కి రాహుల్ గాంధీ నివాళులు

 

విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షకి జాతీయ నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా దీక్షకు మద్దతు తెలిపారు. దీక్షా ప్రాంగణానికి వచ్చిన ఫరూక్ అబ్దుల్లాకి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును కలిసి వేదికపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఉద్ఘాటించారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని, అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారన్నారు.

ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదని హితవు పలికారు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అందర్ని కలిపేందుకు కృషి చేస్తున్నారని ఫరూఖ్ కొనియాడారు. అలాగే చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. దీక్షా స్థలికి చేరుకున్న ఆయన ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబును కలిసి దీక్షకు మద్దుతు తెలిపారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ...భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ భాగం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన మాటను మోడీ పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రధానమంత్రి పాలనలో దేశం ఉండటం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని ధ్వజమెత్తారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ప్రధాని చౌకీదార్‌ చోర్‌గా మారారని విమర్శించారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం నిమిషాల్లో జరుగుతుందని హామీ ఇచ్చారు.