చౌకీదారే దొంగ.. సుప్రీంకోర్టుకి రాహుల్ గాంధీ క్షమాపణ

 

ప్రధాని మోదీని ఉద్దేశించి ‘చౌకీదారే దొంగ’ అని సుప్రీంకోర్టు అన్నట్లు.. తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ఎప్పుడూ పేర్కొనలేదని అఫిడవిట్‌లో అంగీకరించారు. ఎన్నికల ప్రచార జోరులో చేసిన వ్యాఖ్యల్ని ప్రత్యర్థి పార్టీలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. తాను రాజకీయ ప్రచారం వాడివేడిగా జరుగుతున్నపుడు అనుకోకుండా ఈ మాటలు మాట్లాడినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టును రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం పత్రాలు లీక్ అయినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. లీక్ పత్రాలను విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు ఈ నెల 10న ప్రకటించింది. వీటిని విచారణకు అనుమతించరాదని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే అంటోంది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదించి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు పేర్కొంది. దీనిపై ఏప్రిల్‌ 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు రాహుల్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.