మోడీకి టీడీపీ,వైసీపీ రెండు కళ్ళు..!!

ఏపీపై ప్రత్యేకదృష్టి పెట్టిన కాంగ్రెస్, ఇతర పార్టీల మీద విమర్శల డోసు కూడా పెంచింది.. తాజాగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వానికి టీడీపీ, వైసీపీ రెండు కళ్లలాంటివని ఆరోపించారు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొండిచేయి చూపిన బీజేపీ ప్రభుత్వంతో వైఎస్‌ జగన్‌ ఇప్పటికీ స్నేహం కొనసాగిస్తున్నారని రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

2019లో 25ఎంపీ స్థానాలను తమకిస్తే హోదా సాధిస్తామని టీడీపీ, వైసీపీ ప్రచారం చేస్తున్నాయి.. 2014లో అన్ని స్థానాలనూ ప్రజలు ఆ రెండు పార్టీల చేతుల్లోనే పెట్టారు కదా.. ఎందుకు సాధించలేదు? అని ప్రశ్నించారు..  ఆ స్థానాలు కాంగ్రెస్ కు ఇస్తే, మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేస్తాం అన్నారు.. ప్రత్యేక హోదా ఇస్తామని ఈనెల 22న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేసిన రఘువీరా.. అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.. అదేవిధంగా బీజేపీ ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే, ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.