TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూన్ 2న కవిత కొత్త పార్టీ.. రఘునందనరావు జోస్యం నిజమయ్యేనా?

Published on: Tue May 27, 2025 5:07PM

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత, సొంత తండ్రి అయిన   కేసీఆర్ కు రాసిన   లేఖ సృష్టించిన, సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపణలు ఇప్పటిలో ఆగేలా లేవు. కవిత లేఖపై బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. చివరాఖరికి కేసీఆర్ కూడా కవిత లేఖపై స్పందించడం అటుంచి, కన్న బిడ్డను ఆ లేఖ ఎందుకు రాశావు? ఏమైనా ఉంటే నేరుగా నాకే చెప్పొచ్చుగా అని మందలించిన పాపాన కూడా పోలేదు. లేఖ వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ కుమార్తెతో ఆయన భేటీ అయినదే లేదు. అన్నిటికీ ఒకే మందు అన్నట్లుగా మౌనాన్నే ఆశ్రయించారు.

అటు కవిత కూడా తగ్గేదే లే అన్నట్లుగా తండ్రితో భేటీకి అసలు ప్రయత్నమే చేయలేదని తెలుస్తోంది. పైపెచ్చు ఆమె తన సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఆమె చర్యల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆమె మంగళవారం (మే 27)  జాగృతి సంస్థ ప్రతినిధులతో  సమావేశమై సామాజిక తెలంగాణ సహా పలు అంశాలపై చర్చించారు. జాగృతి సంస్థ ద్వారా భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  

ఇక కవిత లేఖ వెలుగు చూసి రోజులు గడిచిపోతున్నా కాంగ్రెస్, బీజేపీలు అదే లేఖ ఆధారంగా బీఆర్ఎ స్ పై విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ రఘునందనరావు ఏకంగా కవిత కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని చెబుతూ, ఆ పార్టీ ఆవిర్భావ తేదీ కూడా వెల్లడించేశారు.  కవిత నేతృత్వంలో తెలంగాణలో జూన్ 2న మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందంటూ జోస్యం చెప్పేశారు.  సొంత పార్టీ పెట్టడమే కాకుండా కవిత రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేయనున్నారని రఘునందనరావు అన్నారు.  

రఘునందనరావు వ్యాఖ్యలతో మరో సారి కవిత భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న చర్చ మరో సారి జోరుగా సాగుతోంది. రఘఉనందనరావు చెప్పినట్లు కవిత కన్న తండ్రికి వ్యతిరేకంగా సొంత కుంపటి పెట్టుకుని రాజకీయ క్షేత్రంలో ఆయనతో తలపడటానికి రెడీ అయిపోయారా?  కొత్త పార్టీ పేరు ఏమిటి?  అన్న చర్చ జోరుగా సాగుతోంది.