TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐపీఎల్ 2026..వరుస విజయాలతో పంజాబ్ కింగ్స్ జైత్ర యాత్ర

Published on: Mon Apr 20, 2026 8:40AM

ఐపీఎల్ 2026 లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇది పంజాబ్‌కు వరుసగా ఐదో గెలుపు కాగా, లక్నోకు ఇది మూడో ఓటమి. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య  37 బంతుల్లో 93, కూపర్ కానొలీ  46 బంతుల్లో 87 పరుగులు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.  వీరి మెరపు బ్యాటింగ్ తో  పంజాబ్ ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ చెరో రెండు వికెట్లు తీశారు.

255 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన  లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 200 పరుగులు మాత్రమేచేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (40), కెప్టెన్ రిషభ్ పంత్ (43), ఐడెన్ మార్క్‌రమ్ (42) రాణించినా ఫలితం లేకపోయింది.  కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో లక్నో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది.

పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మార్కో జాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైశాఖ్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వరుస ఓటములతో లక్నో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది.