TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందుల సస్పెన్స్ థ్రిల్లర్

Published on: Tue May 2, 2023 2:15PM

సస్పెన్స్ నవలలు, సస్పెన్స్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా పొలిటికల్ సస్పెన్స్ నడుస్తోంది.  కడప జిల్లా వాసులు ఆసక్తిగా చర్చించుకుంటున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రధాన సూత్రధారి వైఎస్ అవినాష్ రెడ్డి. కడప పార్లమెంట్ మెంబర్ అయిన అవినాష్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలలో పెద్దగా ప్రజలకు కనిపించింది లేదు.

2019 మార్చి 15వ తేదీన జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరవాత పరిణామాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా మీడియాలో అంతా  అవినాష్ పైనే చర్చ జరిగింది. వారం రోజులుగా ఆచ్చ తగ్గుముఖం పట్టి ఇప్పుడు దాదాపు అదృశ్యమైంది.  దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అవినాష్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నియోజకవర్గంలొగడనగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

ఇది ఒక వైపు నడుస్తుంటే.. మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ వెంట నీడలా అనుసరిస్తున్నారు.  అవినాష్ పర్యటనల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెంటాడుతున్నారు.  ఢిల్లీ, హైదరాబాద్ నుండి వచ్చిన సీబీఐ బృందం ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవచ్చన్న వదంతులు కడపలో జోరుగా షికారు చేస్తున్నాయి. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసి ఉన్న సీబీఐ బృందం ఓవరితోనూ మాట్లాడటం లేదు. సీబీఐ మౌనం వెనుక వ్యూహం ఏమిటో అర్దం కాక స్థానిక వైసీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. అయితే సీబీఐ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని కొందరు బాహాటంగానే చెబుతున్నారు.

వివేకా హత్య కేసు తమను ఇంత ఇబ్బంది పెట్టదని తొలుత వైసీపీ భావించినా, సీబీఐ, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలతో అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాల్సి వచ్చింది. మైసూరు నుంచి విజయ్ కుమార్ గురూజీని, గుజరాత్ నుంచి పరిమళ్ నత్వానీని వైసీపీ అధిష్ఠానం రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద పారిశ్రామిక వేత్తల సమూహం విజయ్ కుమార్ గురూజీని పనిలో పెట్టగా, బీజేపీ అధినాయకత్వం పరిమళ్ నత్వానీని రంగంలోకి దించింది.రాజ్యసభకు పంపించిన వైసీపీని పరిమళ్ నత్వాని సరైన సమయంలో ఆదుకున్నాడని కడప వాసులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 30లోగా అవినాష్ అరెస్టు ఖాయమని పందాలు కాసి ఔత్సీహికులు కొందరు జేబులు ఖాళీ చేసుకున్నారని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో ఒకే రోజు 18 మందికి నోటీసులిచ్చి హడావుడి చేసిన సీబీఐ ఎందుకు వేచి చూస్తోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అరెస్టు చేయాలనుకుని కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గిన సీబీఔ ఇంకా కడపలోనే  ఎ:దుకు మకాం పెట్టిందో అనేది మరో సస్పెన్స్.

తనను అరెస్టు చేస్తే ఆందోళనలకు దిగవద్దంటూ అభిమానులకు సంకేతాలిచ్చిన అవినాష్, ఇప్పుడు అదేమీ పట్టనట్టు పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనతో వివేకా హత్య కేసు పరిశోధనలో కీలక మార్పులు జరిగాయనీ, వివేకా హత్య కేసు కూడా మిగిలిన కేసుల్లా నత్తనడకలా సాగబోతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ భాస్కరరెడ్డి అరెస్టు జరిగినంత పకడ్బందీగా  అవినాష్ అరెస్టు కూడా జరగబోతోందని కడపలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.