TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెంకయ్య జోక్యంతో వేగం పుంజుకున్న అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ

Published on: Mon Mar 30, 2026 4:13PM

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ  ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు.   అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు.  ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.  ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.   ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

 కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు.  అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే  నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.