కొరడా ఝులిపిస్తున్న ఎన్నికల కమీషన్
Published on: Mon May 14, 2012 12:01PM
ఎన్నికల నిబంధనావళిని రోజు రోజుకూ పదునుపెడుతున్నారు. ఎన్నికల కమీషన్ పలురకాల కసరత్తులు చేస్తోంది. టి.ఎన్.శేషన్ హయాం నుంచి ఇప్పటి వరకూ ఎన్నికల నిబంధనావళిని తప్పించేందుకు నేతలు ప్రయత్నించటం కమీషన్ మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోవటం ఆనవాయితీ అవుతోంది. ప్రస్తుత ఎన్నికల కమీషనర్ హెచ్,ఎస్, బ్రహ్మ కూడా ఈ నిబంధనావళిపై తనదైన ముద్ర వేయించుకోవాలని తస్మాత్ జాగ్రత్త అని ఓటరునే నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇదేమిటి ఆని ఆశ్చర్యపోవద్దు ....
డబ్బు తీసుకున్నావా నీపై కూడా కేసు పెత్తదానీ మేము వెనుకాడబోమని బ్రహ్మ ఓటరును నేరుగా హెచ్చరించారు. దీనివల్ల ఏదైనా కొంత మార్పు సాధించగలమేమోనని ఆయన ప్రయత్నం కాబోలు, అయితే మధ్యలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎండకు వదిలేశారని పలువురు ఆయన్ను ప్రశ్నిస్తున్నారనుకోండి. రాష్టంలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈసారి ప్రలోభపెట్టే అంశాలు చాలా ఉంటాయన్న నివేదిక ఆధారంగానే కమీషనరు పైవిధంగా హెచ్చరించారని సిబ్బంది సమాధానమిస్తున్నారు. అయితే ఎన్నికల నిబంధనావళిలో డబ్బు రవాణాను అదుపు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టుల్లో తనిఖీలతో ఎన్నికల కమీషన్ ఒక కొత్త నిఘా చర్యలకు శ్రీకారం చుట్టింది.
అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయ పరిపాలనా ఉద్యోగులను తనకు ఓటేయమని కోరిన మాజీ మంత్రి చింతా మోహన్, చర్చిలో ఎన్నికల ప్రచారం చేసిన టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి వ్యవహారాలపై నివేదిక ఇమ్మని జిల్లా కలెక్టరును ఆదేశించింది. ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకుని తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ప్రసంగించిన టిడిపి నేత చంద్రబాబు నాయుడిపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే సోనియా గాంధీ ఓ పెద్ద క్రిష్టియన్ అని ప్రచారం చేసిన మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని శ్రీకాకుళం కలెక్టర్ ను కోరింది. అంటే కాకుండా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో జరిగే రైతుచైతన్య యాతాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను ఎంత వరకూ అభ్యర్థులు పాటిస్తారో తెలియదు కానీ నిబంధనావళి విషయంలో తాము మాత్రం సీరియస్ గా స్పందిస్తామని ఎన్నికల కమీషన్ స్పష్టం చేస్తోంది. ఎన్నికల కమీషన్ తీరు ఆయా పార్టీల నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.


