ఖైదీ పరార్.. గాలింపు చేపట్టిన పోలీసులు
Published on: Fri Jun 12, 2026 12:34PM

నంద్యాలలో జరిగిన ఒక కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన రాజ్ కుమార్, కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. దీనితో పాటు ఇతను ఒక పోక్సో కేసులో కూడా 20 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడు. కాగా గత ఏప్రిల్ లో రాజ్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు అతడిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స ముగిసిన తర్వాత, పోలీసులు అతన్ని తిరిగి కడప జైలుకు రైలేలో తీసుకువస్తుండగా.. గూడూరు రైల్వేస్టేషన్ వద్ద రాజ్ కుమార్ పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. ప్రమాదకరమైన నేర చరిత్ర కలిగిన ఖైదీ తప్పించుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గూడూరు పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.


