TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారత్-శ్రీలంక మళ్ళీ దగ్గరయ్యే అవకాశం?

Published on: Tue Mar 10, 2015 8:51AM

 

ప్రధాని మోడీ ఈరోజు విదేశీపర్యటనకు బయలుదేరుతున్నారు. ఐదు రోజులపాటు సాగే ఈ పర్యటనలో ఆయన షెల్లాస్, మారిషస్ మరియు శ్రీ లంక పర్యటిస్తారు. ఇదివరకు భారత్-శ్రీలంక దేశాల నడుమ మంచి సంబంధాలే ఉన్నప్పటికీ యల్.టి.టి.యి. కారణంగా క్రమంగా రెండు దేశాల మధ్య దూరం పెరగసాగింది. యల్.టి.టి.యి.ని నియంత్రించడంలో శ్రీలంకకు సహాయపడేందుకు భారత్ శాంతి సేనలను పంపడం, అందుకు ప్రతీకారంగా యల్.టి.టి.యి.కి చెందిన కొందరు వ్యక్తులు భారత ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేయడం వంటి సంఘటనలతో రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది.

 

ఆ తరువాత శ్రీలంక దేశాధ్యక్షుడిగా అధికారం చేప్పట్టిన మహింద రాజపక్సే యల్.టి.టి.యి.ని తుడిచిపెట్టేసే ప్రయత్నంలో వేలాది మంది తమిళ ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులను అతికిరాతకంగా చంపించడంతో అప్పటి నుండి భారత్ తో సహా ప్రపంచదేశాలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. భారత్-శ్రీలంకలు దూరం అవడంతో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా దేశం ఇదే అదునుగా శ్రీలంకలో కోట్ల డాలర్లు కుమ్మరించి దానికి దగ్గిర కాగలిగింది. భారత్ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా చైనాకు చెందిన రెండు అణ్వాయుధ జలాంతర్గాములను తన పోర్టులో నిలిపి ఉంచేందుకు శ్రీలంక అధ్యక్షుడు అనుమతించారు. మోడీ ప్రభుత్వం మళ్ళీ శ్రీలంకతో సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ఈ తొమ్మిది నెలలలో చాలా కృషి చేసింది. కానీ చైనా ప్రభావంలో ఉన్న రాజపక్సే, ప్రధాని రనీల్ విక్రమే సింఘే సానుకూలంగా స్పందించలేదు.

 

ఈ పరిస్థితులలో శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం అందులో మైత్రీపాల సిరిసేన విజయం సాధించి శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టడంతో మళ్ళీ రెండు దేశాల నడుమ స్నేహ సుమాలు విరిసే అవకాశం కలిగింది. ఆయన అధికారం చేప్పట్టగానే మొట్టమొదట భారత్ పర్యటించి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరుచుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం అభినందనీయం. ఆయన ఆహ్వానాన్ని మన్నించి భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంకలో పర్యటించేందుకు బయలుదేరుతున్నారు.

 

కానీ చైనావైపు మొగ్గు చూపుతున్న ఆ దేశప్రధాని ప్రధాని రనీల్ విక్రమే సింఘే ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ సముద్ర జలాలలో ప్రవేశిస్తున్న తమిళ జాలారులను కాల్చి చంపే హక్కు తమకు ఉందని, శ్రీలంకలో ఉన్న తమిళులు (ఆయన దృష్టిలో శరణార్ధులు) అందరూ భారత్ తిరిగి వెళ్లి పోవలసిన సమయం వచ్చిందని చెప్పడం భారత్ లో కలకలం సృష్టించింది. ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనకు బయలుదేరుతున్న ఈ సమయంలో శ్రీలంక ప్రధాని ఈవిధంగా మాట్లాడటం ఇరు దేశాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయి. అయినా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపరుచుకోవాలని భావిస్తున్న ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకోకుండా శ్రీలంకకు వెళుతున్నారు.

 

నేపాల్, శ్రీలంక వంటి చిన్నచిన్న దేశాలకు కూడా భారత్ ఇంత అలుసయిపోయిందంటే అందుకు కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అనుచిత విదేశీ విధానమే. మోడీ ప్రభుత్వం ఆ విధానాలను పూర్తిగా మార్చి ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క అవసరమయినప్పుడు చాలా దృడంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనలో ఇరు దేశాల మధ్య అనేక కీలకమయిన ఒప్పందాలు జరగనున్నాయి. అవి ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పునరుద్దరించబడేందుకు సహాయపడవచ్చును.