TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లాలూ ప్రసాద్ యాదవ్ కి మోడీ సూటి ప్రశ్న

Published on: Sat Oct 10, 2015 7:47AM

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొదలవడానికి ఇంకా కేవలం 48గంటలే మిగిలున్నాయి. కనుక అన్ని రాజకీయపార్టీలు తమ అస్త్ర శస్త్రాలను బయటకు తీసి ఒకదానిపై మరొకటి సంధించుకొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కి ఒక సూటి ప్రశ్న వేసారు. ఆర్.జె.డి.పార్టీ బీహార్ ఎన్నికలలో వంద స్థానాలకు పోటీ చేస్తున్నపుడు ఆయన ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ఎన్నికలలో పోటీ చేయకపోయినా వంద స్థానాల నుండి ఆయన పార్టీ ఎందుకు పోటీ చేస్తోంది.. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ తో నడిపించాలనుకొంటున్నారని స్పష్టం అవుతోందని అన్నారు. కనుక బీహార్ ప్రజలు అటువంటి అస్తిరమయిన, ఆటవిక పరిపాలన సాగించే జనతా పరివార్ కి ఓటు వేయాలో లేక సుస్థిరమయిన ప్రభుత్వాన్ని అందించి బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించగల బీజేపీకి ఓటు వేయాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు.

 

పశువుల దాణా కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారించబడిన లాలూ ప్రసాద్ యాదవ్ కి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చేరు కూడా. ఆ కారణంగానే ఆయన అనర్హుడవడంతో ఈ ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నారు. కానీ మోడీ చెప్పినట్లుగా రిమోట్ పద్దతిలో ప్రభుత్వాన్ని నడిపించాలనే ఉద్దేశ్యంతోనే నితీష్ కుమార్ పార్టీ జే.డీ.యూ.తో సమానంగా ఆర్.జే.డీ.కూడా వంద స్థానాల నుండి పోటీ చేస్తోంది. లాలూ ప్రసాద్ స్వయంగా పోటీ చేయాలేని పరిస్థితి నెలకొని ఉంది కనుక ఆయన తనకు బదులు తన ఇద్దరు కొడుకులను ఎన్నికల బరిలోకి దింపారు. అవినీతి కేసులో జైలు శిక్ష పడినందుకు లాలూపై అనర్హత వేటు పడినప్పటికీ ఆయన దొడ్డిదారిన తన శాసనసభ్యులు కొడుకుల ద్వారా అధికారం చేలాయించాలని, నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అదే ముక్క మోడీ చెప్పారు.