వేతనాల్లో కోతకు స్వచ్చందంగా ముందుకువచ్చిన రాష్ట్రపతి

ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత 
రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ రద్దు
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని, ఎంపీలకు ఇచ్చే నిధుల (ఎంపీ లాడ్స్) ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు ఎంపీల వేతనాలు, అలవెన్స్ లు, పెన్షన్లలో ఈ కోత ఉండేలా ఓ ఆర్డినెన్స్ ను తెచ్చారు.

ఈ నేపథ్యంలో 1954 చట్టాన్ని సవరించారు. ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ ఈరోజు మీడియాకు వివరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘కరోనా’ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ వేతనాల్లో కోతకు వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు.