కేంద్రమంత్రికి ప్రకాశ్ రాజ్ చురకలు...
posted on Jan 22, 2018 1:58PM
కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ జీవ పరిణామక్రమ సిద్ధాంతంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామక్రమ సిద్ధాంతం తప్పని, మన పురాణాలు అలా చెప్పలేదని, డార్విన్ సిద్ధాంతాన్ని కాలేజీలు, స్కూల్స్లో బోధించకూడదని సత్యపాల్ సింగ్ ఆరోపించారు. అయితే సత్యపాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించి ఆయనపై విరుచుకుపడ్డారు. మనిషి కోతి నుంచి పుట్టాడన్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రిగారు అంటున్నారని.. అయితే, ఇప్పుడు మళ్లీ కొన్ని భిన్నమైన పరిస్థితులను మాత్రం మనం చూస్తున్నామన్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా? అని ప్రశ్నించారు. అంటే మానవుడు ప్రస్తుతం కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నాడని ట్వీట్ చేసి చురకలంటించారు. కాగా ప్రకాశ్ రాజ్ గత కొద్దికాలంగా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.