విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో 22 గ్రామాలలో అంధకారం

 

బుధవారం అర్ధరాత్రి నుండి సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మొదలుపెట్టిన 72గంటల సమ్మె ప్రభావం విజయనగరం జిల్లా యస్.కోట పరిధిలో ఉన్న 22గ్రామాలపై పడింది. ఆ గ్రామాలలో నిన్నటి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఉద్యోగులు లేకపోవడంతో సంబందిత అధికారులే దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, కొన్ని చోట్ల పంపిణీ వ్యవస్థలోలోపాలు ఏర్పడటం వలన వారు కూడా చేయగలిగిందేమీ లేదని తెలుస్తోంది. ఇంతవరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అడపా దడపా విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నా వాటిని అధికారులే ఎలాగో సరిచేస్తూ నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 22గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏమీ చేయాలో తెలియక తలలు పట్టుకొన్నారు. వీలయినంత త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.