వైఎస్ వివేకాది హత్యే.. ఏడు కత్తి గాయాలు

 

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది. కడప రిమ్స్‌ ఆస్పత్రిలో వివేకా భౌతిక కాయానికి పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం పులివెందులకు తరలించారు.