టీడీపీకి షాక్ ఇవ్వనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు!!

 

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే టిడిపి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది గోడదూకేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తన్నాయి. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు వైసిపిలోకి వెళ్లిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. 

ప‌ది మంది ఎమ్మెల్యేలు కాదు గాని ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మార‌తార‌ని చంద్ర‌బాబుకే అనుమానాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎవరెవరు పార్టీ మారతారు అన్నదానిపై చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లతో ఓ కమిటీ వేశారట. ఈ కమిటీ కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకుని ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే మారవచ్చని చంద్రబాబుకు తెలిపారట. వీరిలో కొందరు వైసీపీ వైపు చూస్తూ ఉంటే మరికొందరు బిజెపి వైపు చూస్తున్నారట. విశాఖ నగరం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పార్టీ మార‌తార‌ని అంటున్నారు. జగన్ తో సన్నిహిత సంబంధాలు వున్న కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. వంశీకి నేరుగా జగన్‌తో పరిచయంతో పాటు మంత్రి కొడాలి నానికి సన్నిహితుడు కావడంతో వంశీ కూడా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది.