TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముర్ము ఏపీ పర్యటనలో రాజకీయ మరకలు!.. తప్పు బీజేపీదేనా?

Published on: Wed Jul 13, 2022 11:10AM

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో  వివాదంగా మారింది. అధికార వైసీపీ మద్దతును తమ పార్టీ కోరలేదంటూ ఇటీవలే వ్యాఖ్యానించిన, బీజేపీ జాతీయ కార్యదర్శి    సత్యకుమార్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి షెకావత్ తోసిపుచ్చారు. సత్యకుమార్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. సరే అదలా ఉంచితే.. సత్యకుమార్ వ్యవహారం సద్దుమణగక ముందే.. కేంద్ర మంత్రి మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు.  తెలుగు రాష్ట్రాల్లో ముర్ముకు ప్రచార బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  టీడీపీ మద్దతు స్వచ్ఛందమే నంటూ చేసిన వ్యాఖ్యలు కూడా.. టీడీపీ మద్దతు బీజేపీ కోరలేదన్న అభిప్రాయం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది.   సత్యకుమార్ వ్యాఖ్యలు ఖండించిన షెకావత్, ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేసిన కిషన్‌రెడ్డి విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. తనను గెలిపించాని కోరేందుకు ఏపీకి వచ్చిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి  ద్రౌపది ముర్ము కు ఏపీలో ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయనడంలో సందేహం లేదు. . అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ ఓట్లన్నీ ముర్ముకేనన్నది స్పష్టమైపోయింది.   సీఎం జగన్,   ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ముర్ముకే మద్దతు పలికారు.  అయితే బీజేపీకి మాత్రం ఏపీకి సంబంధించినంత వరకూ ఇద్దరు పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తలనొప్పిగా పరిణమించాయి.  వైసీపీ మద్దతు తాము కోరలేదని, తమ దృష్టిలో అది అంటరాని పార్టీనే అంటూ బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించగా, కేంద్రమంత్రి షెకావత్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాము జగన్‌తో మాట్లాడి మద్దతు కోరామని షెకావత్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  

నిజంగా బీజేపీ  వైసీపీ మద్దతు కోరినా, కోరకపోయినా.. ముర్మును గెలిపించేందుకు వేసిన కమిటీకి కన్వీనర్ అయిన షెకావత్ తన పెద్దరికం నిలబెట్టుకున్నారు.  ఆ వివాదానికి తెరపడిందని ఊపిరి పీల్చుకునే లోగానే  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మ టీడీపీ స్వచ్ఛందంగా మద్దతునిచ్చిందంటూ   వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. నిజానికి టీడీపీ  నిజానికి ముర్ము పర్యటనకు ఒకరోజు ముందు మాత్రమే టీడీపీ ఆమెకు మద్దతు ప్రకటించింది. సరే దాని సంగతి పక్కన పెడితే..  కిషన్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత.. సోషల్‌ మీడియాలో టీడీపీపై, వైసీపీ   ట్రోలింగ్ మొదలయింది.

టీడీపీ తనను కోరకుండానే బీజేపీకి మద్దతు నిచ్చిందని కొందరు, బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ తెగ పాకులాడుతోందని అర్ధం వచ్చేలా మరి కొందరు సామాజిక మాధ్యమంలో తెలుగుదేశంపై విమర్శలు, సెటైర్లు వేశారు.   అయితే వాస్తవంగా   టీడీపీ మద్దతు  కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారం ఉదయమే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.  

అయితే కిషన్ రెడ్డి టీడీపీ మద్దతు స్వచ్ఛందమే అంటూ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా బీజేపీని డిఫెన్స్ లో పడేశాయి. సజావుగా సాగిపోవాల్సిన ముర్ము పర్యటనను రాజకీయాల్లోకి లాగినట్లైంది. ఇప్పుడు టీడీపీ కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే షెకావత్ ఏం చెబుతారు. వైసీపీ విషయంలో సత్య కుమార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని అన్నట్లుగానే కిషన్ రెడ్డి విషయంలోనూ అనగలరా?