TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజ‌య్ కి చుక్క‌లు చూపిస్తున్న‌ఈ గ‌వ‌ర్న‌ర్ ఎవ‌రు?

Published on: Fri May 8, 2026 1:49PM

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్ ఉన్నారు. ఈయ‌న గోవాలోని ప‌నాజీలో  1954 ఏప్రిల్ 23,న జన్మించారు. భారతీయ జనతా పార్టీలో  సుదీర్ఘ కాలం పనిచేశారు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గోవా శాసనసభ స్పీకర్‌గా.. 2012-2015 మ‌ధ్య కాలంలో ప‌ని చేశారు. గోవా ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. భారతదేశంలోనే అసెంబ్లీని మొట్టమొదటిసారిగా పేపర్ లెస్ చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ముందుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, ఆ తర్వాత బీహార్ గవర్నర్‌గానూ పనిచేశారు.  జనవరి 2025లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2026 మార్చి 12 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత వివాదం విష‌యానికి వ‌స్తే.. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.  అయితే  ప్రభుత్వ‌ ఏర్పాటుకు కావాల్సిన 118 మ్యాజిక్ మార్కుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ మద్దతును  స్పష్టంగా చూపించాలని గవర్నర్  చెబుతున్నారు. బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలైన కాంగ్రెస్ వంటి వాటి నుంచి రాతపూర్వక లేఖలు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాట రాజకీయ హీటెక్కింది.

 గోవా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం వ‌ల్ల‌, గతంలో ఆయనకున్న బీజేపీ నేపథ్యం వల్ల.. స్థానిక నాయకులు, ఇత‌ర‌ సినీ ప్రముఖులు ఆయన తీరును విమర్శిస్తున్నారు. రజనీ, కమల్, ప్రకాష్ రాజ్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? అని చూస్తే వీరందరూ గవర్నర్ తీరును విమర్శించడానికి ప్రధాన కారణం రాజ్యాంగ సంక్షోభం. కేంద్రం పంపిన గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజల తీర్పును గౌరవించడం లేద‌ని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్ర‌కాష్ రాజ్.

రజనీ, కమల్.. నేరుగా గవర్నర్‌పై యుద్ధం ప్రకటించకపోయినా.. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నర్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని వీరి ఆందోళన. గవర్నర్ అర్లేకర్  తీసుకునే నిర్ణయాలు కేంద్రంలోని బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనీ..  అందుకే ఆయన మెజారిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేదే ఇప్పుడు కీలకం. ఒకవేళ ఆయన మద్దతు లేఖలు సమర్పిస్తే, గవర్నర్ తప్పనిసరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతించాల్సి ఉంటుంది. ఈ లోపు జరుగుతున్న ఈ తాత్కాలిక అడ్డంకులే ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.