రసకందాయంలో కర్నాటకం.. సీఎం సిద్దరామయ్య రాజీనామా?
Published on: Wed May 27, 2026 10:01AM

కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానంతో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. సిద్దరామయ్య బుధవారం ( మే 28) బెంగళూరులో ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల నడుమ సిద్దరామయ్య ప్రెస్ మీట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అదలా ఉంటే.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అయితే.. తాము కేవలం రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల గురించే చర్చించామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ.. కర్నాటక సీఎం మార్పుపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినపడుతోంది.


