TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు?

Published on: Mon Aug 1, 2022 8:01PM

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు , రాజకీయ సమీకరణాలు వేగంగా మరి పోతున్నాయా? కొత్త కొత్త మార్పులు  చోటుచేసుకుంటున్నాయా?  ఇంతవరకు ఓ లెక్క ఇక పై ఇంకో లెక్క అన్నరీతిగా రాష్ట్ర రాజకీయాలను కొత్తమలుపు తిప్పే విధంగా ప్రదాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సక్షేమ పథకాలపైనే దృష్టిని కేద్రీకరించారు. నీట ముంచినా, పాల ముంచినా, ‘మీటదే’ భారం అన్నవిధంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

అయితే, కొంచెం ఆలస్యంగానే అయినా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఒక చేత్తో మీటలు నొక్కుతో మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని  గ్రహించారు. అందుకే, ముఖ్యమంత్రి అలోచనలు, అంచనాలతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జగన్ రెడ్డి ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ జనంలోకి దూసుకు పోతోంది, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ ప్రజాందోళనలలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, ముందుకు పోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరో వంక  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక అందచేస్తున్నారు.  అలాగే, దసరా పండగ తర్వాత బస్సు యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. 

ఇక బీజేపీ విషయానికి వస్తే,నిజానికి రాష్ట్రంలో బీజేపీ బలం కాదు కదా కనీసం ఉనికిని చాటుకునే మందం ఓటు కూడా  లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉందంటే అందుకు  కారణం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న బలం కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ కు లేని గుర్తింపు గౌరవం బీజేపీకి దక్కుతున్నాయి. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం రాష్టంలో పాగా వేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక ఇతరత్రా అవసరాల దృష్ట్యా ఇంతవరకు వైసీపీతో బీజేపీ రహస్య ప్రేమను చూపించింది. ఆ విధంగా,ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం గండ్ల నుంచి బయటపడుతూ వచ్చిందనేది కాదనలేని నిజం. 

కాగా, ఇటీవల కాలంలో,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ముచ్చటగా మూడేళ్ళుగా సాగుతున్న హనీమూన్ ముగింపుకు చేరుకున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ అన్నిటినీ మించి ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం అవసరమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు.ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అలాగే,  బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, చంద్రబాబు ‘విజన్’ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి వచ్చిందని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ఇంత కాలం రాజదాని విషయంలో జోక్యం చేసుకోని బీజేపీ ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ముదనష్టపు ఆలోచనకు వ్యతిరకంగా ప్రత్యక్ష కార్యాచరణకు  దిగిందని అంటున్నారు. నిజమే, మొదటి నుంచి కూడా బీజేపీ ‘ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి’ అనే అంటున్నా, జగన్ రెడ్డి మూడు ముక్కలాటను అడ్డుకునే ప్రయత్నం జరగలేదు. పైపైచ్చు రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానిదే అని కూడా చెప్పింది. కానీ, ఇప్పడు రాష్ట్ర బీజేపీ అమరావతి పాదయాత్ర చేపట్టింది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక తప్పిదాలను ఎత్తి చూపుతూ హెచ్చరికలు చేస్తోంది. ఈ మార్పు మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.