TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాన్ సంక్షోభం.. అమెరికాలో ట్రంప్ కు రాజకీయ సెగ

Published on: Mon May 18, 2026 9:54AM

ఇరాన్‌తో నెలకొన్న  ఉద్రిక్తతలు  అగ్రరాజ్యం అమెరికాలో  అంతర్గత ప్రకంపనలకు కారణమౌతున్నాయి. ఈ ఉద్రిక్తతల  ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి.  ఇది ట్రంప్ కు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఇది   తలనొప్పిగా మారింది.

 ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో గ్యాస్ ధర సగటున గ్యాలన్‌కు  4.51 డాలర్ల మార్కును తాకింది. ఇరాన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సామాన్య అమెరికన్లు కేవలం ఇంధనం కోసమే అదనంగా సుమారు 45 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ తీవ్ర ఆర్థిక భారాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ట్రంప్ యంత్రాంగంపై విమర్శల దాడి  తీవ్రం చేశారు. ట్రంప్ ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగానే దేశంలో డీజిల్, నిత్యావసరాలు, వ్యవసాయ ఎరువులతో పాటు సామాన్యుడి గృహ రుణాలు కూడా మోయలేనంత భారంగా మారాయని విమర్శిస్తోంది.

అయితే..  డొనాల్డ్ ట్రంప్  మాత్రం ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ఏకైక లక్ష్యమని అంటున్నారు. భద్రత గురించి తప్ప..  ధరల పెరుగుదల, ప్రజల ఇబ్బందుల గురించి తాను ప్రస్తుతం ఆలోచించడం లేదని అంటున్నారు.  అయితే ట్రంప్   వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో మరింత దుమారం రేపాయి. దేశాన్ని ట్రంప్ సర్కార్ అనవసరమైన యుద్ధ వాతావరణంలోకి నెట్టిందని డెమొక్రాటిక్ ప్రతినిధి హకీమ్ జెఫ్రీస్ విమర్శించారు.

దీనికి భిన్నంగా..  దేశ సార్వభౌమత్వం, భద్రత ముందు ఈ ఆర్థిక ఇబ్బందులు కేవలం తాత్కాలికమేనని రిపబ్లికన్ నేతలు గట్టిగా సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఇరాన్ నుండి పొంచి ఉన్న ముప్పును తొలగించడమే ప్రథమ కర్తవ్యమని పాలకపక్షం భావిస్తోంది. ఈ సైనిక ఉద్రిక్తతలు ముగియగానే దేశంలో చమురు మరియు ఇతర నిత్యావసరాల ధరలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని రిపబ్లికన్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయినా కూడా రాబోయే ఎన్నికల్లో ఈ ఆర్థిక సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన మాత్రం రిపబ్లికన్ లలో వ్యక్తమవుతోంది.