బెంగాల్లో రాజకీయ హత్యలు.. పీకే వ్యూహమేనా?
Published on: Sat Mar 26, 2022 11:02AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంచుమించుగా,సంవత్సరం కావస్తోంది. కానీ, ఆ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, రాజకీయ హత్యల పరంపర ఇంకా ఈనాటికీ కొనసాగుతూనే వుంది. కొద్ది రోజుల క్రితం, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. భాదు షేక్ అనుచరులు, ఆయన ప్రత్యర్ధుల ఇళ్ళకు నిప్పు పెట్టారు. పిల్లా పాపలతో సహ, ఎనిమిది మంది సజీవ దహన మయ్యారు.
ఈ సంఘటనకు సంబంధించి తృణమూల్ బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ సహా 23మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు.. బీర్బమ్ సజీవదహనాల కేసులో కోల్కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.నిజానికి, పశ్చిమ బెంగాల్లో, మమతా బెనర్జీ పాలనలో, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా రాజకీయ హత్యలు యదేచ్చగా సాగుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జగదీష్ ధనఖర్’ ప్రభుత్వాన్ని అనేక మార్లు హెచ్చరించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ..గవర్నర్ మీద, గవర్నర్ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యుధాన్ని ప్రకటించారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను సమర్ధించడమే కాకుండా, ఆమె అడుగుజాడల్లోనే నదుస్తున్నారు. తెలంగాణ గవర్నర్, తమిళి సై’ ని చిన్న చూపు చూస్తున్నారు. అవమానిస్తున్నారు, అనే ఆరోపణలున్నాయి.
అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న బీర్బమ్ కాల్పుల ఘటనను, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ పార్లమెంట్లో ప్రస్తావించారు.ఈ ఘటనపై రాజ్యసభలో మాట్లాడుతూ ఆమె ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. బెంగాల్ను ఆదుకోవాలని ఆవేదనతో కూడిన అభ్యర్ధన చేశారు. పశ్చిమ బెంగాల్’లో దారుణ హత్యలు జరుగుతున్నాయని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు.మరోవైపు బీజేపీ ఎంపీ ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు.
అదలా ఉంటే, పార్లమెంట్ ‘లో ప్రస్తావన రావడంతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కలవర పాటుకు గురయ్యారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇంకెన్ని, కళేబరాలు బయటకు వస్తాయో అనే భయం ఎంపీలలో కనిపించిందని, బీజేపీ ఎంపీలు అంటున్నారు.మరో వంక రాష్ట్ర హై కోర్టు, బీర్భూమ్ సజీవదహనాలు కేసులో విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. సిట్ దర్యాప్తు సరైన దిశలో సాగుతుందని మమత నేతృత్వంలోని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయవద్దని చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. సీబీఐ విచారణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని హైకోర్టు సూచించింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన పిటిషన్పై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.మరో వంక జాతీయ మానవ హక్కుల సంఘం, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టు కున్నట్లు, మెల్లగా ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు. అక్రమ ఆయుధాలను జప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు.
అయితే, బెగాల్లో గత కొంత కాలంగా కొనసాగుతున్న హింసకు, రాజకీయ హత్యలకు కారణం ఏమిటి? మూలం ఎక్కడుందిమ, అని అలోచిస్తే, నిజం అయినా కాకపోయినా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రలలో అధికార పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్, వ్యూహంలో భాగంగా బెంగాల్లో మొదలైన హింస ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. బీర్భూమ్ సజీవ దహనం దుర్ఘటనకు కూడా పీకే వ్యూహంలోనే బీజం పడిందనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. ఈ నేపధ్యంలో, ఉభయ తెలుగు రాష్ట్ర్లాలలో పీకే వ్యూహాలు అమలైతే, పరిస్థితి ఏమిటి? ఎన్నెన్ని బీర్భూమ్ దుర్ఘటలను చూడవలసి వస్తుంది, అనే ఆందోళన తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది.


