TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసు.. ఇక అరెస్టేనా?

Published on: Fri Feb 28, 2025 8:50AM

గోరంట్ల మాధవ్.. ఈ పేరు వినగానే ఎవరన్నది పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ న్యూడ్ వీడియో ఎంపీ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. ఔను హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బూతుకే రోత పుట్టేంత ఛండాలం.  అంత అసహ్యం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా గోరంట్ల మాధవ్ పై వైసీపీ అధినేత ఎటువంటి చర్యా తీసుకోలేదు. పైపెచ్చు ఆయనో ఘన కార్యం చేశారన్నట్లు పార్టీ ఓటమి తరువాత ఆయనకు పార్టీ పదవి కూడా ఇచ్చారు.

గత ఎన్నికల ముందు కూడా గోరంట్ల మాధవ్ ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. వైసీపీ వైనాట్ 175 అంటూ  పార్టీ అధినేత జగన్ మాటలను తన నోట కూడా వినిపిస్తూ.. లోకేష్ పాదయాత్ర కాదు, చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్రయాత్ర ఆపడం ఎవరి తరం కాదంటూ రెచ్చి పోయారు.  అంతేనా తెలుగుదేశంతో జట్టు కట్టినందుకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలపై కూడా నోరు పారేసుకున్నారు. అయితే ఇంత చేసినా వైసీపీ అధినేత జగన్ గోరంట్లకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. 
ఇక తన న్యూడ్ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత కూడా గోరంట్ల మాధవ్  జిమ్ చేస్తుండగా ప్రత్యర్థులు మార్ఫింగ్ చేశారనీ, వీరిపై పోలీసు కేసు పెడతాననీ ప్రకటనలు గుప్పించారు. అయితే ఆ దిశగా ఆయన ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదు. పోలీసు కేసు పెట్ట లేదు.  కాగా   గోరంట్ల  న్యూడ్ వీడియో ఒరిజనల్ అంటూ అమెరికాలోని ఓ ల్యాబ్స్   సర్టిఫై కూడా చేయడంతో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ అర్ధమైపోయింది.

గత ఎన్నికలలో గోరంట్లకు పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఇవ్వకపోవడానికి కూడా న్యూడ్ వీడియోయే కారణం. ఎన్నికలయ్యే వరకూ సైలెంట్ గా ఉంటే.. ఎన్నికలలో విజయం సాధించేది మన పార్టీయే అప్పుడు చూసుకుందాం.. అని గోరంట్లను పార్టీ పెద్దలు బుజ్జగించినట్లు కూడా పార్టీ వర్గాలలో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సరే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. జగన్ సర్కార్ గద్దె దిగింది. అయినా పార్టీ మాత్రం గోంరట్లను వెనకేసుకునే వస్తోంది. ఆయనకు జగన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి పదవిని ఇచ్చారు. అశ్లీల చర్యలు,  అసభ్య పదజాలం గోరంట్లకు భూషణాలు అనుకున్నారేమో, లేదా తమ పార్టీ వాయిస్ అదే అని భావించారో ఏమో జగన్ ఆయనకు పార్టీ అధికార ప్రతినిథి బాధ్యతలను అప్పగించారు. అలాంటి గోరంట్ల మాధవ్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.  మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి ఫద్మ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదుచేసి  మార్చి 5న విచారణకు రావాల్సిందిగా నోటీసు జారీ చేశారు.  

పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. గతంలో పోలీసు ఆఫీసర్ గా పని చేసిన గోరంట్ల మాధవ్  ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది.  బాధితురాలి గోప్యతకు భంగం కిలిగించడం, అనుచిత వ్యాఖ్యల కేసులో గోరంట్ల అరెస్టు కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.