జగ్గయ్యపేట పోలీసుల అదుపులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి
Published on: Wed Mar 12, 2025 9:46AM
.webp)
జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని సరిహద్దులనూ దాటేసి ఇష్టారీతిగా అడ్డగోలుగా వ్యవహరించిన ఒక్కొక్కరిపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న సంఘటనలను నాటి పాపాలకు ఇప్పుడు వారంతా శిక్ష అనుభవించడం ఖాయంగా కనిపిస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు, ఆ తరువాత పోసాని కృష్ణ మురళి అరెస్టు.. బెయిలు కోసం పోసాని రోజు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసులో పీటీ వారెంట్ తో పోలీసులు సిద్ధంగా ఉండటం చూస్తుంటే.. జగన్ హయాంలో ఇష్టారీతిగా, నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా వాగిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఇప్పుడు తాజాగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డిని కడప జైలు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కడప జైలులో ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని జగ్గయ్య పేట పోలీసలు పీటీ వారెంట్ పై బుధవారం తెల్లవారు జామున జగ్గయ్య పేటకు తీసుకువచ్చారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిలలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్రాపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024లో ఆయన చేసిన వ్యాఖ్యలపై జగ్గయ్య పేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన గోపీ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ కేసు విచారణ నిమిత్తం వర్రా రవీందర్ రెడ్డిని కడప నుంచి పీటీ వారెంట్ పై జగ్గయ్యపేటకు తీసుకువచ్చారు. వర్రా రవీందర్ రెడ్డి బూతు పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలతో జగన్ హయాంలోనే కాదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా రెచ్చిపోయారు.
రవీందర్రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అంతేకాదు రవీంద్ర రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేకా హత్యకేసులో జగన్, అవినాష్రెడ్డిపై విమర్శలు చేసిన షర్మిల, సునీతపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అప్పట్లో ఆ పోస్టుల్లో.. అవసరమైతే సునీతను కూడా లేపేయండి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ తల్లి విజయమ్మపైనా పోస్టులు పెట్టడం సంచలనం రేపింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల, సునీతలు మనస్తాపంతో వర్రా రవీంద్ర రెడ్డిపై అప్పట్లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. కూటమి నేతలపై అత్యంత హేయమైన రీతిలో వర్రా పోస్టులు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీందర్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో, హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి.


