తప్పుడు రిపోర్టులు..మాజీ మంత్రి దీక్ష భగ్నం

 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ..  మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు  నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. పోలీసు వాహనంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే...దీక్ష చేస్తున్న మాణిక్యాలరావు నీరసంతో కొంత సేపు వేదికపై విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం వైద్యులు డాక్టర్‌ ప్రసాదరావు, పట్టణ సీఐ సుభాష్, రూరల్‌ సీఐ శ్రీనివాసు తదితరుల పర్యవేక్షణలో మాణిక్యాలరావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

పరీక్షల అనంతరం డాక్టర్‌ ప్రసాదరావు.. సోమవారం దీక్షలో కూర్చునే సమయంలో 71 కిలోల బరువు ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 69 కిలోలకు తగ్గారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా బీపీ, బరువు తగ్గడంతో వేగంగా డీహైడ్రేషన్‌ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితిలో సెలైన్లు ఎక్కించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించారు. దీంతో పోలీసులు ఆయన దీక్ష భగ్నం చేశారు.  అంబులెన్సు సిద్ధం చేసినా.. అందులో ఎక్కించడం కష్టమై.. పోలీసు వాహనంలో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదిలాఉంటే అభివృద్ధి విషయంలో  దొంగ లెక్కలు చెప్పిన విధంగానే ప్రభుత్వం తన వైద్యపరీక్షల రిపోర్టులను తప్పుగా ప్రకటిస్తోందని మాణిక్యాలరావు విమర్శించారు. షుగర్‌స్థాయి 70కి పడిపోయిందని అన్నారని, అలా పడిపోవడానికి అవకాశం లేదు.. సరిగా పరీక్షలు చేయండని అడిగితే తర్వాత షుగర్‌ లెవెల్‌ 128 ఉందని పేర్కొన్నారని మాణిక్యాలరావు తెలిపారు. రక్తపరీక్షల ఫలితాలనూ తప్పుగా చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టమైన హామీ రావాలని, అది వచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. దీక్షను భగ్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.