పోలవరం రివర్స్ టెండరింగ్ తో ఆదా కాదు.. 1600 కోట్ల భారం

 

 

పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని చెప్పి నవయుగ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసిన జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విధానంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ.4358 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐతే దీని పై స్పందించిన సీనియర్ టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రంపై రూ.1600 కోట్ల మేర భారం పడుతుందని అన్నారు. రివర్స్ టెండరింగ్ లో ఒకే సంస్థ టెండర్ వేసిందంటే అర్థం ఏంటని అయన ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 67 నిబంధనలకు విరుద్ధంగా ఒకే సంస్థకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఏ విశ్వసనీయతతో మేఘా సంస్థకు టెండరు అప్పగించారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై విశ్వసనీయత ఉంటే కేవలం ఒక్క సంస్థే టెండరు ఎలా వేస్తుందని నరేంద్ర అన్నారు. ప్రీబిడ్ సమావేశానికి ఎనిమిది కంపెనీలు హాజరైనా ప్రభుత్వంపై నమ్మకం లేకే మిగిలిన సంస్థలు ముందుకు రాలేదని నరేంద్ర వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు సంస్థకు రూ.300 కోట్లు ఇచ్చారని, పనుల్లో జాప్యం వల్ల రూ.300 కోట్ల వరకుభారం పడుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పిందని తెలిపారు. ఇపుడు విద్యుత్ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా మరో రూ.1000 కోట్ల వరకు భారం పడుతుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయం లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోదావరి జిల్లాల భద్రతను పణంగా పెడుతున్నారని ప్రభుత్వం పై నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.