నిజాయితీగా అమలు చేయండి.. ప్రధానికి రాహుల్ విజ్ఞప్తి

దేశం మొత్తం వలస కార్మికులకు అండగా నిలవాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, వలసకూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లక్షలాది వలస కార్మికులు కాలినడకన స్వగ్రామాలకు  వెళ్తున్నారని.. వారితో పాటు భావిభారత చిన్నారులు రోడ్లపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భారత నిర్మాణంలో వలస కార్మికులదే కీలక పాత్ర. భవిష్యత్తులోనూ వారు కీలక భాగస్వాములుగా ఉంటారు అన్నారు. ఇప్పుడు వలస కార్మికులకు డబ్బు అవసరం అని తెలిపారు.  పేదలకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు సాయాన్ని జమచేయాలని ప్రధాని మోదీని కోరుతున్నాను అని రాహుల్ చెప్పారు. చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజీని నిజాయతీగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం జాగ్రత్తలు వహిస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేతకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థిక ప్యాకేజి విషయంలో ప్రధాని పునరాలోచించాలన్నారు. కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, కూలీలు పడుతున్న ఆవేదనను చూపిస్తోన్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని రాహుల్ వ్యాఖ్యానించారు.