ప్రపంచమంతా రామమయమే: ప్రధాని మోదీ

అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.44.08కి శంకుస్థాపన జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. జైశ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. జైశ్రీరామ్ నినాదాలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయన్నారు. ఇదొక చారిత్రాత్మక దినమని, వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలించిందని అన్నారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు.

 

ఏళ్ల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగిందని.. అదే విధంగా రామాలయం కోసం కూడా పెద్ద పోరాటం జరిగిందని అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, వారందరి త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. 130 కోట్ల ప్రజలు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారని తెలిపారు. రాముడి కార్యక్రమాలన్నింటినీ హనుమంతుడు చేస్తాడని.. హనుమంతుడి ఆశీస్సులతోనే ఈరోజు మందిర నిర్మాణం ప్రారంభమైందని మోదీ అన్నారు. 

 

ప్రపంచమంతా రామమయమేనని, మన పొరుగునున్న దేశాల సంస్కృతిలో కూడా రాముడు ఉన్నాడని ప్రధాని అన్నారు. ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని చెప్పారు. బుద్ధుడి బోధనల్లో, గాంధీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని.. కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్ఫూర్తి అని అన్నారు. మనం ఎలా బతకాలనే విషయాన్ని రాముడి జీవితం మనకు బోధిస్తుందని ప్రధాని చెప్పారు.