'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకు పీఎం మోదీ పబ్లిసిటీ!!

 

లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ.. ఈ సినిమా ప్రమోషన్ కూడా కాంట్రవర్సీతోనే వెళ్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోని వర్మ.. ఈరోజు ప్రధాని మోదీ ఏపీ పర్యటనను కూడా తన సినిమా ప్రమోషన్ కి వాడుకుంటున్నారు.

ఈరోజు మోదీ గుంటూరులో బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య సభకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన మోదీ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మరి వర్మ ఆగుతాడా? అసలే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' లో ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచారో చూపిస్తాం అంటూ చెప్తున్నారు. ఇప్పటికే వెన్నుపోటు అనే సాంగ్ కూడా రిలీజ్ చేసి సంచలనం రేపారు. మరి వర్మకి అంత ఇష్టమైన వెన్నుపోటు అనే పదం మోదీ నోటి నుంచి వచ్చింది. ఇంకేముంది మోదీ మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. "ప్రధాని మోదీ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకు పబ్లిసిటీ చేసున్నారు" అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.