రాఫెల్ గుట్టు రట్టు.. రిలయన్స్ ఎంపిక మోదీదే.!!
posted on Sep 22, 2018 10:48AM
రాఫెల్ స్కామ్.. చాలా రోజుల నుంచి కాంగ్రెస్, అధికార పార్టీ బీజేపీ మీద రాఫెల్ ఒప్పందం గురించి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తోంది.. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. కాంగ్రెస్ అర్ధంలేని ఆరోపణలు చేస్తుంది అంటూ కొట్టిపడేసింది.. ఇదిలా ఉంటే ఇప్పుడు బీజేపీకి ఓ అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది.. తాజాగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ జర్నల్ ‘మీడియా పార్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ కంపెనీని భాగస్వామిని చేయాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమే’నని బాంబు పేల్చారు.. 'ఈ వ్యవహారంలో మా ప్రమేయం ఏమీ లేదు.. భారత ప్రభుత్వమే ఆ గ్రూపు (రిలయన్స్) పేరు ప్రతిపాదించింది.. ఆ మేరకు అనిల్ అంబానీ గ్రూపుతో డసో సంప్రదింపులు జరిపింది.. ఇచ్చిన భాగస్వామిని తీసుకున్నాం.. మాకు మరోఅవకాశం లేదు’ అని తెలిపారు.. హోలెన్ వివరణ అనంతరం ప్రతిపక్షాలు ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించాయి.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ ‘ప్రధాని స్వయంగా రహస్య పద్ధతుల్లో సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని మార్చారు.. హోలెన్ పుణ్యమా అని మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం.. అంబానీకి కోట్లాది రూపాయల కాంట్రాక్టును ఎలా ఇచ్చారో తెలుసుకున్నాం.. ప్రధాని దేశాన్ని మోసగించారు.. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు’ అని వ్యాఖ్యానించారు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ఏదో చెడు జరగకపోతే ప్రభుత్వం ప్రతిరోజూ ఎందుకు అబద్ధం చెబుతుందని ప్రశ్నించారు.