TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Published on: Thu Jul 24, 2025 7:50PM

 

తెలంగాణలో జరిగిన కులగణన సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదన్నారు. కొన్ని విషయాల్లో ఎన్డీయే సర్కార్ దిగి వచ్చేలా రాహుల్ గాంధీ పోరాటం వల్లే కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రేవంత్ తెలిపారు. కులగణన దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచి పోతుందని అన్నారు. ఈ సర్వేపై తెలంగాణలోని అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని, అందరి సంతోషం కోసం పరిస్థితులను బట్టి ముందుకు సాగాలని వివరించి, ఒప్పించామని సీఎం తెలిపారు. 

ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలు చేస్తుందని వెల్లడించారు. ఓబీసీలకు ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నిర్ణయంతో, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కులగణన సర్వే పూర్తి చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన పకడ్బందీగా నిర్వహించిందని రాహుల్ అన్నారు. కులగణన అంత సులభం కాదు కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర నేతలు అంచాలకు మించి రాణించారని తెలిపారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలరాయిగా నిలుస్తుందని తెలిపారు. 

ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు.