పీకే ఫ్రీ కాదు.. చాలా కాస్ట్లీ గురూ..!
Published on: Tue Mar 22, 2022 12:23PM
అబద్ధం చెప్పినా గోడ కట్టినట్లు ఉండాలని, అంటారు, నిజానికి ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్’ సామర్ధ్యం మీద ఎవరికీ, ఎలాంటి అనుమానం లేదని అంటారు. అయితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’, ‘పైసా తీసుకోకుండా, ఫ్రీగా సేవలు అందిస్తున్నారు’, అంటే మాత్రం ఎవరూ నమ్మడం లేదు. ఎవరో కాదు, పీకే’ నే నమ్మరు. ఎందుకంటే, ఆయనేమి ‘చారిటబుల్ ట్రస్ట్’ను నడపడం లేదు. పీకే నడుపుతున్న ఐప్యాక్ సంస్థలో లక్షలలో జీతాలు తీసుకునే వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతే కాదు, పోనీ కేసీఆర్ చెప్పినట్లుగా, తమలాగానే పీకేకు కూడా అర్జెంటుగా ఈ దేశాన్ని మార్చేయాలనే ‘పవిత్ర’ ఆశలు, ఆశయాలు ఏమైనా ఉన్నాయా అంటే, అలాంటి పిచ్చి ఆలోచనలు పీకే చేయరని ఆయన ట్రాక్ రికార్డే స్పష్టం చేస్తుందని, బృందం సభ్యులే అంటారు. నిజానికి, ఆవిషయం పీకేనే స్వయంగా చెప్పుకున్నారు.
వ్యూహ కర్తగా పీకే ప్రయాణం (బిజినెస్) బీజేపీతో మొదలైంది. కాంగ్రెస్, తృణమూల్, వైసీపీ, డిఎంకే, ఆప్, ఇప్పుడు తెరాస ఇలా ఓ అరడజనుకు పైగా పార్టీలు ఆయన సేవలను వినియోగించుకున్నాయి. డజనుకు పైగా రాష్ట్రాల్లో పీకే పనిచేశారు. సో.. కేసీఆర్ ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా, పీకే పక్కా రాజకీయ వ్యూహాల వ్యాపారి, వ్యూహ రచనల బేహారి. ఆయన సిద్దాంతాలు, రాద్ధాంతాల పొడ కూడా దగ్గరకు రానీయరు. ఒక సారి పనై పొతే, కడిగేసుకుని పోవడమే కానీ, పాత క్లైంట్ గురించి కొత్తగా ఆలోచనలు చేయరు. ఇది కుడా ఎవరో చెప్పిన విషయం కాదు, ఆయనే స్వయంగా ఒకటి రెండు ఇంటర్వ్యూలలో చెప్పారు.
అంతేకాదు, ఆయన తమ క్లైంట్’ను గెలిపించడం వరకే అలోచిస్తారు తప్పింఛి, రాష్ట్రం గురించి, ప్రజల గరించి ఆయన పట్టించుకోరు. ఆయన సలహాలు పాటించి అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. పొరుగునే ఉన్న ఏపీని చూస్తేనే తెలుస్తుంది. ఎవరో కాదు, తెలంగాణ మంత్రులే, ఏపీ ఎంత దౌర్భాగ్య స్థితిలో వుందో వేదికలు ఎక్కి మైకులు పట్టుకుని మరీ చెప్పారు. అప్పు పుట్టనిదే పూట గడవని పరిస్థితిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని తెలంగాణ మంత్రులు నేక సందర్భాలలో పొరుగు రాష్ట్రాని ఎద్దేవ చేశారు. ఈనేపధ్యంలో ఇప్పుడు పీకే ‘ఉచిత’ సేవలు ఉపయోగించుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని కేసీఆర్, ఉద్దరిస్తారు,అంటేఎవరైనా ఎలా నమ్ముతారు. అందుకే, కేసీఆర్’ అసత్య హరిచంద్రుడే అయినా ఆయన మాటలు ఎవరూ నమ్మడం లేదని అంటున్నారు. ఇక బెంగాల్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఆయన రగిల్చిన, హింసాగ్ని ఇప్పటికీ రగులుతూనే ఉంది. రక్తం రుచి మరిగిన రాజకీయ కార్యకర్తలు ఇప్పటికీ రక్తం చిందిస్తూనే ఉన్నారు. చని పోతూనే ఉన్నారు.
నిజానికి పీకే, ఫ్రీ కాదు, వెరీ కాస్ట్లీ... ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ /మమతా బెనర్జీ గెలుపు తర్వాత, ఆయన రేటు భారీగా పెరిగిందని, చిన్నా చితక పార్టీలు అసలు ఆయన్ని భరించలేవని, అందుకే, ఆయన ఐప్యాక్’ లో పనిచేసిన కొంత మంది చేత ‘చిన్న క్లైంట్స్’ కోసం ‘కొత్త దుకాణాలు’ తెరిపించారని కూడా అక్కడక్కడా వినిపిస్తోంది. తెలంగాణ విషయాన్నే తీసుకుంటే వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పీకే’ టీమ్’ మాజీ సభ్యుడు తమ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారని చెప్పారు.
అదలా ఉంటే, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రశాంత్ కిశోర్ సేవలు అందించారు.175 శాసనసభ స్థానాలుండగా 151 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో అధికారంలోకి తేవడం వెనక పీకే నేతృత్వంలోని ఐప్యాక్ సంస్థకు పార్టీ భారీగా చెల్లించిన విషయాన్ని స్వయంగా వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల ఖర్చు నివేదికలో తెలిపింది. దీనిప్రకారం పార్టీ ఐప్యాక్ సంస్థకు రూ.37.57 కోట్లను చెల్లించింది. ఇది అధికార లెక్కలేనని, అనధికారికంగా ఎన్నో రెట్లు ఎక్కువగా ముట్టచెప్పారని విపక్షాలు చెబుతున్నాయి. నిజానికి, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ కిషోర్కు రూ.300 కోట్లు చెల్లిస్తోందన్న ఊహాగానాలపై స్పందించాలని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్’ ఇమిడిఎట్ రియాక్షన్’ గా (నవ్వుతూనే కావచ్చును) ‘అది చాలా తక్కువ’ అన్నారు. అంటే, రూ.300 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలోనే పీకేకి ముట్ట చేపుతున్నామని కేసీఆర్’ చెప్పకనే చెప్పారని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించడంతో పాటుగా, కేసీఆర్’ను జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు తెరాస పీకే’తో కుదురుచుకున్న ఒప్పందం ఖరీదు తక్కువలో తక్కువ రూ. 500 కోట్లకు తక్కువ కాకుండా ఉంటుందని అంటున్నారు. నిజానికి, పీకే కాంట్రాక్టు రూ.600 కోట్లు అందులో రూ.300 కోట్లు అడ్వాన్సు పేమెంట్ అయిన తర్వాతనే పేకే, పని మొదలు పెట్టారని పింక్’ పార్టీ సమాచారం. పీకే రేటు ఎంత అనేది వేరే విషయం,కానీ, పీకే ఫ్రీ కాదు .. వెరీ కాస్ట్లీ అందులో సందేహం లేదని అంటున్నారు.


