TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిఠాపురం వర్మకు ఉద్వాసన.. హైకమాండ్ ఆలోచన ఏంటి?

Published on: Fri May 8, 2026 10:49AM

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా వర్మ తొలగింపు నిజంగా ఒక అనూహ్య పరిణామమే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పీఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగిస్తూ తెలుగుదేశం హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాలలో పెను సంచలనం రేపింది.  పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో..  ఇక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ నేపథ్యంలోనే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.

పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ   తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి..  క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం  మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంలో వర్మదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు.  వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి మరీ  అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం స్థానిక టీడీపీ శ్రేణులలో కూడా అసంతృప్తికి కారణమైంది. 

గత కొద్దిరోజులుగా పిఠాపురంలో జనసేన,  టీడీపీ స్థానిక నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులతో   వాగ్వాదాలకు దిగారు. ఇప్పుడు అవే తెలుగుదేశం అధిష్ఠానం వర్మపై వేటు వేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అదే విషయంలో వర్మ తనను ఇన్ చార్జిగా తొలగించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ బలోపేతానికి తన రక్తాన్ని ధారపోశాననీ..  ఏనాడు క్రమశిక్షణ తప్పలేదని చెబుతూ.. అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని ముగించి కన్నీటిని ఆపుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  తెలుగుదేశం శ్రేణుల్లో వర్మ పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే వర్మను  నియోజకవర్గ బాధ్యతల నుంచే తప్పించి ముందు ముందు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం హైకమాండ్ ఉందని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఆ కూటమిలోని ఇద్దరు ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికే అధిష్టానం ఈ  నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  రాబోయే రోజుల్లో పిఠాపురం టీడీపీలో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్మ వంటి బలమైన నేతను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవడం ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందు ఉన్న టాస్క్ గా చెబుతున్నారు.