తోట నాకెప్పటికీ శత్రువే.. వైసీపీలో చేరినా వదిలేదిలేదు: పిల్లి

 

తూర్పుగోదావరి జిల్లా కీలకనేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన వైసీపీలో చేరి వారం రోజులు కూడా గడవక ముందే పాత గొడవలు తెరపైకి వచ్చాయి. ఒకప్పుడు జిల్లాలో జరిగిన ‘వెంకటాయపాలెం శిరోముండనం’ కేసులో తోటను కఠినంగా శిక్షించాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కాన్వాయ్‌ను దళిత సంఘం నేతలు అడ్డుకున్నారు. తోటను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని దళిత సంఘాలు పట్టుబట్టాయి. 

ఈ సందర్భంగా సంఘం నేతలతో పిల్లి మాట్లాడుతూ.. త్రిమూర్తులు తమ పార్టీలో చేరినా.. ప్రభుత్వం తరుపున కేసు విషయంలో బాధితులకు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన.. తోటపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తోట త్రిమూర్తులు నిన్న, ఈరోజు, రేపు కూడా నాకు శత్రువే. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో జగన్ ప్రభుత్వం దళితుల పక్షమే వహిస్తుంది. వైసీపీ స్థాపించినప్పట్నుంచి దళితులే పార్టీకి అండగా ఉన్నారు. దళితులను మేం వదులుకోం. ఈ కేసులో ఏదైనా తేడా జరుగుతుందేమో..? అందుకే బాధిత దళితులను సీఎం వద్దకు తీసుకువెళతాను. అవసరం అయితే దళితులతో కలిసి రోడ్డుపై ధర్నా చేసేందుకైనా నేను సిద్దమే. పార్టీలోకి ఎందరో వస్తుంటారు పోతుంటారు.. మాకు దళితులే ముఖ్యం’ అని పిల్లి చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

1996 డిసెంబర్ 29న రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో శిరోముండనం ఘటన జరిగింది. తోట త్రిమూర్తులు ప్రధాన ముద్దాయిగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దళిత యువకులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలకు.. తోట త్రిమూర్తులు, అతని అనుచరులు శిరోముండనం చేసారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు అయింది. అయితే ఇరవై ఏళ్లు దాటినా ఈ కేసులో పురోగతి లేదు. దీంతో దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరి తోట ఎప్పటికీ శత్రువే అని చెప్తున్న డిప్యూటీ సీఎం.. బాధితులకు ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి.