TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

9న సిట్ విచారణకు ప్రభాకరరరావు

Published on: Sat Jun 7, 2025 10:25AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్‌రావుకు సోమవారం (జూన్ 9) సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఆయన  గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయనకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ  జారీ కావడంలో జరిగిన జాప్యంతో ఇండియాకు రాలేకపోయారని చెబుతున్నారు. శుక్రవారం నాడు ఆయనకు  ట్రాన్సిట్ వారీ జారీ చేసింది. దీంతో శనివారం (జూన్ 7) ఆయన అమెరికా నుంచి బయలుదేరి ఆదివారం (జూన్ 8)కి హైదరాబాద్ చేరుకుంటారు. ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం (జూన్ 9) సిట్ విచారణకు హాజరౌతారు.  

వాస్తవానికి ముందుగా అనుకున్న ప్రకారం ప్రభాకరరావు గురువారం (జూన్ 5)న సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆయన సమాచారం ఇచ్చారు కూడా. అయితే ఆ రోజు ఆయన విచారణకు డుమ్మా కొట్టడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన విచారణకు జూన్ 5న హాజరు కాలేకపోవడానికి కారణం ట్రాన్సిట్ వారంట్ జారీలో జాప్యమేనని తేలింది.  అయితే ఇంత కాలంగా ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అవ్వడానికి ముందే చికిత్స అంటూ అమెరికాకు వెళ్లిపోయారు. తొలుత ఆరు నెలల్లో వస్తానన్నారు.   ఆ తరువాత అమెరికా నుంచి ఇక తిరిగి వచ్చేది లేదని చాటుతున్న విధంగా గ్రీన్ కార్డు తీసుకున్నారు.  దీంతో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ కావడంతో గత్యంతరం లేక సుప్రీంను ఆశ్రయించి పాస్ పోర్టు ఇప్పిస్తే విచారణకు హాజరౌతానని అన్నారు.  ఆయన విజ్ణప్తిపై సుప్రీం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇప్పుడు ఆయన సిట్ విచారణకు హాజరు కానున్నారు.