TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో... ఈఎస్ఐ ఉద్యోగుల్లో భయంభయం

Published on: Wed Oct 9, 2019 10:36AM

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పది మందిని రిమాండ్ కి తరలించిన ఏసీబీ అధికారులు.... తాజా మరో ముగ్గురు కీలక నిందితును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాంతో ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన నిందితుల సంఖ్య 13కి చేరింది. మరోవైపు ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో... ఎవరు ఎప్పుడు అరెస్టు అవుతారోనన్న భయం ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉద్యోగుల్లో నెలకొంది.

అయితే, తాజాగా వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డితోపాటు కె.లిఖిత్ రెడ్డి, కె.రామిరెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ డైరెక్టర్ పద్మతో కలిసి అరవింద్ రెడ్డి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మెడికల్ ఎక్విప్ మెంట్ సరఫరా చేయకుండానే... చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి....  సర్కారు సొమ్మును స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేల్చారు.

ఇక, ఈఎస్ఐతో అనుసంధానంగా పనిచేసిన హెల్త్ కేర్ సెంటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫార్మాసిస్టులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఒకరి తర్వాత మరొకరిని అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణవ్యాప్తంగా ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. సోదాలు దొరికిన ఆధారాల ఆధారంగా అరెస్టుల చేస్తున్నారు.