TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దిరెడ్డి జమిలి జపం.. ఎందుకంటే?

Published on: Tue Jul 1, 2025 11:38AM

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ గౌరవం ఇచ్చే ఇచ్చే అతికొద్ది మంది నాయకుల్లో ఒకరు. కొంత కాలంగా పొలిటికల్ స్టెట్‌మెంట్లకు దూరంగా ఉంటున్నారు పెద్దిరెడ్డి. మాజీ సీఎం జగన్ తరహాలోనే ఆయన జమిలి మంత్రి పఠిస్తున్నారు. 2027 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని,  వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషే ఆ విషయం చెప్పారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పైగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారంటూ పెద్దిరెడ్డి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ తరహాలో ఆయన కూడా తొలిసారి జమిలిమంత్రం పఠించడటంతో రాజకీయ వర్గాల్లో జమిలిపై చర్చ మొదలైంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన కొన్ని రోజుల తర్వాత నుంచి రాష్ట్రంలో జమిలి ఎన్నికల ప్రచారం జోరందుకుంది.   2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. పార్టీలో పెద్దాయనగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడాఇప్పుడు  అదే చెబుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది.

అసలు పెద్దిరెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ ఊపందుకుంది. పెద్దిరెడ్డి ఈ సమయంలో జమిలి జపం చేయడానికి ప్రధానంగా  రెండు  కారణాలు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం వైసీపీని సహజంగానే నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్రంలో కూటమి తిరుగులేని మెజార్టీ ఉండడంతో వలసలు సర్వ సాధారణమయ్యాయి. క్షేత్రస్థాయిలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు, క్యాడర్‌లో నైతిక స్థైర్యం నింపేందుకే స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చన్న మాట విన్పిస్తోంది. 

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తోంది వైసీపీ. గత వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరికీ తాము ఎన్నో సంక్షేమ పథకాలు అందించగా.. ఇప్పుడు వాటిలో కొన్నింటిని కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని జగన్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కోసమే ఈ మైండ్ గేమ్ అడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెద్దిరెడ్డి కావచ్చు.. లేదంటే మరో వైసీపీ నేత కావచ్చు.. ఎవరి కామెంట్లనైనా పక్కన పెడితే జమిలీ ఎన్నికలు 2027లో వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అదంత సులువేం కాదన్న మాట విన్పిస్తోంది. ఇప్పటికే జనగణనకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణనలోనే కులగణన చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది.

జనగణన, కులగణన పూర్తి చేసి, పార్లమెంటులో వాటిని ఆమోదించే ప్రక్రియ పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. పైగా నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎలాగూ ఉంది. ఆ ప్రకారం చూస్తే ఏదైనా అద్భుతం జరిగి చకచకా పరిణామాలు జరిగితే తప్ప 2029 వరకు జమిలీ వచ్చే అవకాశామే లేదన్న వాదన వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ఆ క్రమంలో  వైసీపీ కార్యకర్తలు, నేతలను ఇతర పార్టీల వైపు వెళ్లకుండా నిలువరించడం, ప్రత్యర్థి పార్టీలపై మైండ్ గేమ్ ఆడడం లక్ష్యంగా వైసీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న వాదన బలంగా విన్పిస్తోంది.