TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దిసుదర్శన్ రెడ్డి ఇక లేరు.!

Published on: Fri Jul 31, 2026 10:28AM

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,  బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ  గురువారం (జులై 30) అర్ధరాత్రి దాటిన తరువాత తుదిశ్వాస విడిచారు.   

గత ఆదివారం నర్సంపేటలోని తన నివాసంలో సుదర్శన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురై ఒ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) ప్రక్రియ ద్వారా గుండె కొట్టుకునేలా చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌  యశోద ఆసుపత్రికి తరలించి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు.

వైద్యుల కథనం ప్రకారం..  పెద్ది సుదర్శన్ రెడ్డికి   రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరగడం వల్ల ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దీనివల్ల గుండె రక్తనాళాల్లో అవరోధం ఏర్పడి ఆయన స్పృహ తప్పిపడిపోయారు. ఘటన సమయంలో సుమారు 45 నిమిషాల పాటు హృదయ స్పందన నిలిచిపోవడంతో మెదడుకు   ఆక్సిజన్ కొరత ఏర్పడి, నాడీ వ్యవస్థ దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా   ఆయన నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును సాధారణ స్థితికి తెచ్చేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. మెదడు పనితీరు పూర్తిగా నిలిచిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యింది.  పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ లో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.  పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు తరలించారు. హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అభిమానులు, పార్టీ నాయకుల సందర్శన కోసం ఉంచి, అక్కడ నుంచి   నర్సంపేటకు తరలిస్తారు. మధ్యాహ్నం తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

వరంగల్ జిల్లా నల్లబెల్లి లో  జన్మించిన సుదర్శన్ రెడ్డి..  నల్లబెల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు.  2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో   చురుగ్గా పాల్గొన్నారు.  2014 ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ, ఆ తర్వాత తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా  బాధ్యతలు నిర్వహించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా  విజయం సాధించారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Peddi Sudarshan Reddy Passed Away,  Narsampet Ex MLA, BRS Leader , Telangana Politics News, Telugu One